Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మనం కూడా అతని ప్రపంచంలోకే..! కథలు చాలామంది రాయగలరు. కథలు కొంతమందే చెప్పగలరు. చెప్పినట్లుగా మరికొద్దిమంది మాత్రమే రాయగలరు. అలా రాసేవాళ్ల రాతలు చదువుతుంటే మనం ఈ లోకంలోంచి వాళ్ల కథాలోకంలోకి ఇట్టే వెళ్లిపోతాం. వాళ్ల చేతికొసవేలు పట్టుకుని తిరుగుతుంటాం. వాళ్లు ఎక్కడికి తిప్పితే అక్కడికే వెళుతుంటాం. వాళ్లు రాసిన కథలన్నీ మన నేత్రాలముందు దృశ్యాలుగా కదిలిపోతుంటే విస్మయంతో చూస్తుండిపోతుంటాం. ఆ చిత్కళకు చిక్కి మనల్ని మనం మరచిపోతుంటాం. అదిగో అలాంటి అసలైన తెలుగుకథానికలకు సిసలైన చేవ్రాలు చింతకింది శ్రీనివాసరావు అక్షరీకరించిన ఈ ఉడుకుబెల్లం కథలు. మనల్ని మనమే గుర్తుపెట్టుకోలేకపోతున్న వర్తమానంలో మనలోని మనిషిని మనకి చూపిస్తాయి. ఈ కథలు. మనలో ఆర్చుకుపోయిన మానవతా చెలమల్లో కొత్తనీటి బుగ్గలు పొంగేలా చేస్తాయి. అయినా చింతకింది. అక్షరశక్తి తెలుగునాట తెలియనిదెవ్వరికి. కథ, నవల, నాటకం, కవిత్వం, వ్యాసం... ఇలా చేపట్టిన సాహిత్య ప్రక్రియల్లా అతని కరాన కళకళలాడుతుంది. అతని తలాన తళతళా మెరుస్తుంది. కళింగసీమ గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తున్నవాడు... ఆధునిక తెలుగు సాహిత్యవనంలో నిలిచి సరస్వతీ సమర్చన చేస్తున్నవాడు... పుట్టినచోటు నుంచి అక్షరచక్రాలమీద ప్రపంచాన్ని చుట్టిరావాలని బయలుదేరినవాడు ఈ శ్రీనివాసరావు... తియ్యని ఉడుకుబెల్లం వేళ తనకి వేల దీవెనలు. వేనవేల అభినందనలు.
-ఆచార్య ప్రయాగ సుబ్రహ్మణ్యం