Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
హరిమయము గాని వస్తువు పరమాణువైనను లేదని శ్రీ శుక బ్రహ్మ పరీక్షిత్తు మహారాజునకు శ్రీ మద్భాగమతము నందు బోధించియున్నాడు. అనగా మన కంటి కగుపడునది, మన చెవులకు వినబడునదంతయు విష్ణుమయమే యని తోచుచున్నది.
పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివిః అని వేదము పలుకుచున్నది. ఒక భాగము మనకగుపడు ప్రపంచముగను - మిగిలిన మూడుభాగములు గ్రహ నక్షత్ర మండలములుగ నున్నవని బోధపడుచున్నది. భగవద్గీత విభూతియోగము నందు
అథవాబహునైతేన కిం జాతేన తవార్జున
విష్టభ్యాహ మిదంకృత్స్న మేకాంశేనస్థితో జగత్ భగవద్గీత 10-42
పై విషయమును రూఢి గావించుచున్నది.
మమైవాంశో జీవలోకే జీవ భూతస్సనాతనః అని భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తియోగమున 7వ శ్లోకమున జగద్గురుడగు శ్రీ కృష్ణ భగవానుడు చాటి చెప్పియున్నాడు.
అనగా మానవునకు ప్రపంచమునకు భగవంతునకు విడదీయుటకు వీలులేని సంబంధము పెనవైచుకొని యున్నటుల అర్థమగుచున్నది.
ఆ వివరము తెలిసిన మహానుభావుడు 'అహంబ్రహ్మస్మి' - నేనే ఆ బ్రహ్మ పదార్థమని ఆనందరసానుభూతిలో మునిగి తేలుచున్నాడు.
తండ్రి స్థిరచరాస్థులకు పుత్రుడెటుల వారసుడో ఆ ఆనందము సహితము మనకు జన్మతః సంక్రమించియున్నది. దుర్వ్యసనములచే తండ్రి గట్టిన యిల్లు, తాతల నాటి క్షేత్రములను, అత్తవారిచ్చిన అంటు మామిడి తోట, కులసతిమేని సొమ్ములు వమ్మొనరించి చేతులు కాలిన పిదప ఆకులకై ప్రాకులాడునటుల మానవుని మనుగడ సాగిపోవుచున్నది