'వీరులు మళ్లీ పుట్టాలి, తయారు కావాలి'
ఓ రోజున విమానంలో బెంగుళూరు నుండి వైజాగ్ ప్రయాణం చేస్తుండగా ఓ ఇంగ్లీషు జర్నల్ లో బోస్ పుస్తకం గురించి రివ్యూ చదివాను. బోస్ మరణం గురించి వివరణ ఇచ్చిన పుస్తకం చూడగానే, ఎన్నో సంవత్సరాల నుంచి బోస్ మరణంపై పలురకాల అనుమానాలు, సంశయాలు, పలురకాల కథలు వింటూ వున్నాం, చదువుతూ ఉన్నాం. ఈ మధ్యన 2004 ముందు కూడా హిందూ పత్రికలో 1945 తరువాత బోస్ బ్రతికేవున్నట్లు ఓ ప్రముఖ వ్యక్తి చెప్పినట్లు చదివాను. బోస్ పట్ల నాకే కాదు మనందరికీ అపారమైన భక్తి, ప్రేమ, ఆరాధన ఉన్నాయి. దేశంలో ఓ గొప్ప స్వతంత్ర పోరాట యోధుడు అంతటి ధీశాలి, భారత జాతిలో పుట్టినందుకు ' గర్వించాలి మనందరమూ. ఆ యోధుడి మరణం పై వున్న వివాదానికి తెరదించే పుస్తకం ఆశిస్ రే ఇంగ్లీసులో రాసారు దానిని రాయడానికి ఓ ముప్పై సంవత్సరాలు దర్యాప్తు చేసి, చాలా వివరణలు సేకరించి రాసిన పుస్తకమని రివ్యూలో చదివిన తరువాత ఆ పుస్తకాన్ని చదవాలని నిర్ణయించుకున్నాను.
పుస్తకం తెచ్చిన వెంటనే ఐదవ అధ్యాయం 'ద క్రాస్' (విమానం కూలిపోవడం) చదివాను. రచయిత రచనా శక్తి, శైలి, యథార్ధ ప్రకటన నచ్చి దీనిని తెలుగు ప్రజలకు పాఠకులకు తెలియజేయాలి అని తెలుగులోకి అనువదించాలి అనుకున్నదే తడవగా తర్జుమా చేయడం మొదలు పెట్టాను,
వెంటనే రోలి ప్రచురణకర్తలతో సంప్రదించాను. మేడమ్ రూపా వారితో సంప్రదించాను. ఆమె తెలుగు పబ్లిషర్స్ తో మాట్లాడించమని కోరారు. అలానే చేసాను. ఇక నావంతు పని తర్జుమా చేయడమే చేసాను.