Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
విశ్వనాథ సత్యనారాయణగారి సాహిత్యం మళ్లీ చదవటం మొదలు పెట్టాను. సగం అయిపోయింది. నేను మొదటిసారి చదివినప్పటికంటే యిప్పుడు ఆయన ఎంత సంస్కారో నాకు అర్థమవుతూ ఉంది. ఒకప్పుడు అపార్థం చేసుకున్నానని కాదు కాని, యిప్పుడు మరింత బాగా అర్థమవుతున్నాడు విశ్వనాథ.
- కాళీపట్నం రామారావు
కాలపురుషుడి ముందు అందరూ సమానమేనన్న ఎరుక ఉన్నవాడికి కులతత్త్వం ఉండే అవకాశం లేదు. ఆయన రాసిన వీరవల్లడు నవల చదవినప్పుడు ఆయనకు కులతత్త్వం ఆపాదించటం అన్యాయం అనిపిస్తుంది. ఈ నవలలో ఒక బ్రాహ్మణ కుటుంబంలోని కుర్రవాడికి వల్లడని పేరు. అతను చదువుకొనేచోట ఆ పేరు మోటుగా ఉందని సహాధ్యాయులు ఎగతాళి చేస్తారు. ఆ కుర్రాడు తన పేరు మార్చమని ఇంట్లో గొడవ చేస్తాడు. అప్పుడా పిల్లవాడి నాయనమ్మ ఆ పేరు వెనక వున్న కథ చెప్తుంది. వల్లడనే దళితుడు దాయాదుల చేతిలో అన్యాయమైపోయిన తమ కుటుంబాన్ని ఎలా నిలబెట్టాడో, దిక్కులేక ఊరొదిలిపోయిన తమను ఎన్నో సాహసాలు చేసి తిరిగి తమ వూరికి ఎలా రప్పించాడో చెప్పి, ఏమి చేసినా అతని ఋణం తీర్చుకోలేము నాయనా, అందుకే అతని పేరు నీకు పెట్టి నిత్యం స్మరించుకుంటున్నాము అంటుంది. కులతత్త్వం ఉన్నవారు ఇలాంటి కథ పొరపాటున కూడా రాయరు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఏటి కెదురీదే లక్షణమున్న విశ్వనాథ అసలే రాయడు. కులమతాల కతీతంగా మనిషి కృతజ్ఞతా భావం కలిగి వుండాల్సిన అవసరాన్ని విశ్వనాథ ఈ కథలో చిత్రిస్తాడు. సిద్ధాంత ప్రకటనల కంటే కులమతాలకు అతీతంగా ఉండాల్సిన వ్యక్తి సంస్కారం మీదే విశ్వనాథకు నమ్మకమెక్కువ.
- పిన్నమనేని మృత్యుంజయరావు